దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన చలో సంసద్ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. గత కొన్ని గంటలుగా రాజధానిలో హై టెన్షన్ నెలకొంది. మరోవైపు విపక్ష పార్టీలు ప్రధాని మోడీ నివాసం ఎదుట నిరసనకు దిగారు. సర్వత్రా టెన్షన్.. టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీజేపీ నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయినా పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు పరస్పరం సందేశాలు పంపించుకున్నట్లు కొన్ని చాట్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినా పరస్పరం సంప్రదింపులు కొనసాగించేందుకు బ్లూటూత్ ఆధారిత ‘సీక్రెట్ యాప్’ వినియోగించినట్లుగా తేటతెల్లమైంది. అంతేకాకుండా కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ప్రస్తుతం ఈ సందేశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చాట్ల వెనుక ఉన్న రహస్యం, వాటిని పంపిన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ నిలిచినా పని చేసిన సీక్రెట్ యాప్?
పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన చాట్లలో.. నిరసన ప్రాంతానికి చేరుకున్న తర్వాత మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవచ్చని హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా పోలీసులు నెట్వర్క్ జామర్లు ఉపయోగించారని… ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘‘నిరసన ప్రాంతానికి వెళ్లాక ఫోన్ నెట్వర్క్ ఉండకపోవచ్చు. అందుకే ముందుగానే అందరూ ఒకే యాప్ను ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ అవ్వాలి.’’ అని సూచించినట్లు పోలీసులు గుర్తించారు. బ్లూటూత్ సిగ్నల్ ఆధారంగా పనిచేసే కొన్ని యాప్ల లింకులను కూడా అదే గ్రూపులో షేర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ యాప్లపై సైబర్ నిపుణులు సాంకేతిక విశ్లేషణ చేస్తున్నారు.
‘మోడీ ప్రభుత్వానికి చివరి రోజు’..
చాట్ల్లో తీవ్ర రాజకీయ హెచ్చరికలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక సందేశంలో ‘‘రేపే మోడీ ప్రభుత్వానికి చివరి రోజు’’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘‘ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారు గుర్తుంచుకోండి.. మీ త్యాగాన్ని భావితరాలు గుర్తుంచుకుంటాయి.’’ అని ఉండగా.. మరో సందేశంలో ‘‘ఎవరైనా చనిపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.’’ అని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఫోరెన్సిక్ పరిశీలన
ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనా? లేక నిరసనలను హింసాత్మకంగా మార్చేందుకు ముందస్తు వ్యూహంలో భాగమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాట్ సందేశాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, మొబైల్ ఫోన్ వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ప్రతి డిజిటల్ సందేశాన్ని సాంకేతికంగా ధృవీకరించిన తర్వాతే సాక్ష్యంగా పరిగణిస్తామని, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

