CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రో‌చ్‌ల మౌనం ఎందుకు..?

  • పంజాబ్ పేపర్ లీక్ వివాదంపై సీజేపీ మౌనం..
  • యువత నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు కాక్రోచ్ పార్టీ దూరం..
  • వైరల్ అవుతున్న కాక్రోచ్ లీడర్ల వీడియో..
Cjp

Cjp

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్తగా ప్రహ్లాద్ జోషి ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు యువత నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కు కొత్త డిమాండ్ ఎదురవుతోంది. పంజాబ్, కర్ణాటక పేపర్ లీకులపై స్పందించాలని కోరుతున్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేసేలా ఉద్యమం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ డిమాండ్లపై సీజేపీ నుంచి మౌనమే ఎదురవుతోంది.

పంజాబ్‌లో ఇటీవల ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఫార్మసీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌లో అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి బైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సీజేపీ పంజాబ్ అంశంపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తుందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేవలం సెలెక్టివ్‌గా ఉద్యమం చేస్తున్నారని విమర్శిస్తోంది.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కూడా పేపర్ లీక్ అంశం ప్రస్తావనకు వస్తోంది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ నిర్వహించిన పరీక్షపై ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, ఆ రాష్ట్ర మంత్రి మధు బంగారప్ప రాజీనామాను కోరుతోంది. ప్రధాన్ రాజీనామా విషయంలో బీజేపీపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్, తన ప్రభుత్వంలోని మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది.

మరోవైపు, సీజేపీ లీడర్లు పంజాబ్ పేపర్ లీక్ అంశంపై మాట దాటేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఆప్ నేత మనీష్ సిసోడియాను అక్కడ ఉన్న విద్యార్థులు ప్రశ్నించడం వైరల్ అవుతోంది. కాక్రోచ్ పార్టీ సీనియర్ నాయకులు సౌరభ్, అశుతోష్ రాణాలను ఒక జర్నలిస్ట్ పంజాబ్ పేపర్ లీక్‌ గురించి ప్రశ్నించిన నేపథ్యంలో వారు సమాధానాలు చెప్పకుండా కారులో వెళ్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్‌పై మాట్లాడిన గొంతుకలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.