CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్‌ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..

  • కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక..
  • సీజేపీ-డెమొక్రటిక్ పార్టీ ఏర్పాటు..
  • సీజేపీ ‘‘టీమ్ కేజ్రీవాల్’’గా మారిందని విమర్శ..
  • ఒకే రాజకీయ పార్టీపై పోరాటం ఎందుకు? అని ప్రశ్న..
Cjp Protest

Cjp Protest

CJP: నీట్ పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలు కేంద్రంగా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(CJP)’’ ఏర్పాటైంది. జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేసి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించేలా చేసింది. ఇదిలా ఉంటే, కాక్రోచ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేపీలో విభేదాలు వచ్చాయి. సీజేపీపై ఆరోపణలు చేస్తూ మనీష్ బ్రహ్మభట్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమెక్రటిక్(CJP-D) పేరుతో కొత్త వర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జాతీయ టీమ్‌లో ప్రతీ రాష్ట్రం నుంచి ఐదుగురు చొప్పున వాలంటీర్లు, నిరసనకారుల్ని చేర్చాలని తాము సూచించామని, కానీ సీజేపీ ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పారు. సీజేపీ-డెమొక్రటిక్ పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య నిర్ణయ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తుందని బ్రహ్మభట్ చెప్పారు.

జంతర్ మంతర్ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత సీజేపీ అమ్ముడుపోయిందని, రాజకీయంగా మారిందని బ్రహ్మభట్ ఆరోపించారు. ప్రస్తుతం అది టీమ్ కేజ్రీవాల్‌గా మారిందని దుయ్యబట్టారు. సీజేపీ-డెమెక్రటిక్ ఏర్పాటుకు, ఇటీవల సీజేపీ ప్రకటించిన కొత్త టీమ్ ఎంపిక కారణమని ఆయన చెప్పారు. అయితే, కొత్త కమిటీ ఏర్పాటు చేసే సమయంలో ఒక్క వాలంటీర్‌ను కూడా సంప్రదించలేదని ఆరోపించారు. సీజేపీ కొత్త టీమ్‌లో 12 మందిలో 8 మంది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో సంబంధం ఉన్న వారిని చేర్చారని ఆరోపించారు. సీజేపీ ‘‘టీమ్ కేజ్రీవాల్’’గా మారిందని దుయ్యబట్టారు. 8 మందితో పాటు ఒక మహిళా స్నేహితురాలిని, కాలేజీ స్నేహితుడిని కూడా టీమ్‌లో చేర్చారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే సీజేపీ పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీజేపీ టీమ్‌లో అధికార ప్రతినిధి తప్పా మరే మహిళ లేదని, ముస్లింలు, సిక్కుల్ని వాడుకుని అన్యాయం చేశారని, వారికి చోటు కల్పించలేదని అన్నారు. ఇది పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం అయినప్పటికీ, ఇందులో ఏ విద్యార్థినీ భాగస్వాములను చేయలేదని అన్నారు. సీజేపీనే పేపర్ లీక్ మాఫియాగా మారిపోయిందని ఆరోపించారు. ఉద్యమంలో శివసేన, ఆప్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బీజేపీ, కాంగ్రెస్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన వారు ఉద్యమంలో పాల్గొన్నారని అయినప్పటికీ ఒక్కరికీ సీజేపీలో చోటుకల్పించలేదని అన్నారు. సీజేపీ కేవలం ఒకే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.