Chennai Suitcase Torso Case Twist: చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5న ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో రైలులోని రిజర్వేషన్ లేని బోగీలో ఎర్రటి ట్రాలీ సూట్కేస్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతురాలిని తమిళనాడుకు చెందిన హైదుల్ నిషాగా పోలీసులు గుర్తించారు. నింధితులు అక్కడే హైదుల్ నిషాను హత్య చేసిన అనంతరం మృతదేహంలోని కొన్ని శరీర భాగాలతో బిరియానీ వండి.. తరువాత భాగాలను సూట్కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్ప్రెస్లో తరలించారు.
దీనీ కోసం చెన్నై సెంట్రల్ నుంచి కూడువాంచేరి వరకు 350కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సూట్కేస్తో ఓ వ్యక్తి, మహిళ చెన్నై సెంట్రల్కు వచ్చిన దృశ్యాలను గుర్తించారు. సూట్కేస్ను తమిళనాడు ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో ఉంచిన తర్వాత ఇద్దరూ రైలు నుంచి దిగిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానిత జంట కూడువాంచేరిలోని ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీల సందర్భంగా మానవ రక్తపు ఆనవాళ్లు ఉన్న పాత్ర లభించినట్లు సమాచారం. అనుమానితులుగా మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భగ్మతి మాజిక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.
ఉద్దీన్ లస్కర్, భగ్మతి మాజిక్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఒడిశా వైపు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను అక్కడికి పంపినట్లు సమాచారం. మరోవైపు మృతదేహానికి సంబంధించిన తల, చేతులు ఇంకా లభించాల్సి ఉంది. అసలు హత్యకు కారణం ఏంటి?.. మృతురాలిని ఎందుకు హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి రైలులో తరలించారు?.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

