కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, ప్రావిడెంట్ ఫండ్, వీక్లీ ఆఫ్స్ ఇలా అన్నింటిపై ప్రభావం పడనుంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. రోజూవారీ పని గంటలు పెరగడంతో పాటు ఉద్యోగుల హోం టేకింగ్ సాలరీ తగ్గి, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది.
ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాల కింద నిబంధనలను రూపొందించ లేదు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ముసాయిదా నిబంధనలు ప్రచురించాయని కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. కొత్త కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు పని గంటలను 8-9 గంటల నుంచి 12 గంటల వరకు పెంచవచ్చు.. అయితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్లను అందించాలి. కొత్త చట్టాల ప్రకారం మొత్తం పనిగంటల్లో తేడాలు ఏమీ ఉండవు. వారానికి మొత్తం 48 పనిగంటలు పనిచేయాల్సి ఉంటుంది.
ఇక వేతనం విషయానికి వస్తే గ్రాస్ సాలరీలో కనీసం 50 శాతం బేసిక్ సాలరీ ఉండనుంది. దీని వల్ల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పెరగనుంది. దీని వల్ల ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు గణనీయంగా ప్రభావితం కానున్నాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం పదవీ విరమణ కార్పస్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఉపసంహరించుకుని కొత్తగా 4 కార్మిక చట్టాలను తీసుకువచ్చింది. అయితే కార్మిక అంశం అనేది కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని ఉమ్మడి అంశం కావడంతో రాష్ట్రాలు కూడా కొత్త కోడ్ కింద నియమ, నిబంధనలను తెలియజేయాల్సి ఉంటుంది.