CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు

Cbse Osm Controversy

Cbse Osm Controversy

CBSE OSM Controversy: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. CBSE ఛైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో OSM సేవల సేకరణ, టెండర్ కేటాయింపు ప్రక్రియపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల CBSE రీ-వాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు బోర్డు వెల్లడించింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే పోర్టల్‌పై 15 లక్షల హిట్లు నమోదయ్యాయని, లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు జరిగినట్లు CBSE తెలిపింది. ఈ దాడుల కారణంగా సేవలకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, భద్రతా వ్యవస్థలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పేర్కొంది.

విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని రీ-వాల్యుయేషన్ ప్లాట్‌ఫారమ్‌లో పలు మార్పులు చేసినట్లు CBSE వెల్లడించింది. సెషన్ టైమ్ లిమిట్‌ను పెంచడంతో పాటు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల నాటికి 16 వేల మందికి పైగా విద్యార్థులు తమ దరఖాస్తులను విజయవంతంగా పూర్తి చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇక 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియకు సంబంధించి CBSE కీలక సూచనలు జారీ చేసింది. సమాధాన పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ లేదా రీ-వాల్యుయేషన్‌కు అర్హులని స్పష్టం చేసింది. సంబంధిత సబ్జెక్టు మార్కింగ్ స్కీమ్‌ను పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రీ-వాల్యుయేషన్ అనంతరం మార్కులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చని, ఒక్క మార్కు తగ్గినా అది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రీ-వాల్యుయేషన్ ఫలితమే తుది నిర్ణయమని, దానిపై మరింత అప్పీల్ లేదా సమీక్ష ఉండదని వెల్లడించింది.

×
×
Ad

ఇదిలా ఉండగా, OSM వ్యవస్థకు సేవలు అందిస్తున్న COEMPT సంస్థకు కాంట్రాక్ట్ ఎలా కేటాయించారనే అంశంపై కేంద్ర విద్యాశాఖ పూర్తి వివరాలు కోరింది. టెండర్ ప్రక్రియలో అనుసరించిన నిబంధనలు, నిర్ణయాలు తీసుకున్న అధికారులు, ఎంపిక విధానం వంటి అన్ని అంశాలపై నివేదిక సమర్పించాలని CBSEను ఆదేశించింది. రీ-వాల్యుయేషన్ ప్రక్రియలో కొన్ని సమాధాన పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో OSM వ్యవస్థపై విమర్శలు పెరిగాయి. దీంతో కేంద్ర విద్యాశాఖ టెండర్ ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించి, నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలు జరిగాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి పత్రాలు, రికార్డులను సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. OSM వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, విచారణ ఫలితాలు CBSE పరిపాలనలో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.