దేశంలో “ఒమిక్రాన్”!వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాసారు. “కొవిడ్” నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న కేంద్రం… కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు లేఖలో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
అయితే జిల్లాల్లో కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలి. “కంటైన్మెంట్ జోన్లు”గా పరిగణించి..అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని… అలాగే జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.
