అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయాలని క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైడ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్కు టిప్ ఇచ్చే విధానం అన్యాయమైన వ్యాపార పద్ధతి అని.. దీనిని నిలిపివేయాలని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఆదేశాలు జారీ చేశారు. రైడ్ పూర్తయ్యాక టిప్ ఇవ్వాలా లేదా అనేది వినియోగదారుడి ఇష్టమని.. టిప్ ఇస్తేనే రైడ్ యాక్సెప్ట్ చేస్తారనే భావన కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ అంశంపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణం ప్రారంభించకముందే డ్రైవర్కు టిప్ ఇచ్చేలా ప్రయాణికులను ప్రోత్సహించే అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించేదిగా, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా గుర్తించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అధిపతి నిధి ఖరే తెలిపారు. ఈ వ్యాఖ్యలు సెప్టెంబర్ 15న రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ Rapidoపై CCPA రూ.10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజు వచ్చాయి. అడ్వాన్స్ టిప్పింగ్తో పాటు పలు అన్యాయమైన వ్యాపార పద్ధతులకు సంబంధించి ఈ చర్య తీసుకుంది.
క్యాబ్ వచ్చే ముందే టిప్ ఎందుకు?
క్యాబ్ అగ్రిగేటర్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని నిధి ఖరే తెలిపారు. రైడ్ తీసుకునే ముందే డ్రైవర్కు అడ్వాన్స్గా టిప్ ఇవ్వాలనే విధానం కొన్ని ప్లాట్ఫామ్లలో కనిపిస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టిప్ చెల్లించకపోతే రైడ్ లభించే అవకాశం తగ్గుతుందనే భావన కలిగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆమె వివరించారు. ఇది మిస్లీడింగ్, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా గుర్తించినట్లు తెలిపారు. వివరణాత్మక దర్యాప్తు, సంబంధిత సంస్థల వాదనలు విన్న తర్వాత రైడ్ ప్రారంభానికి ముందే టిప్ చెల్లించేలా ఉండే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు నిధి ఖరే వెల్లడించారు.
టిప్ పూర్తిగా ప్రయాణికుడి ఇష్టం
డ్రైవర్కు టిప్ ఇవ్వడం పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయమని నిధి ఖరే స్పష్టం చేశారు. రైడ్ పూర్తయిన తర్వాత ప్రయాణికుడి ఇష్టానుసారం టిప్ ఇచ్చే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. రైడ్ పొందాలంటే ముందుగానే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని తెలిపారు.
Uber, Olaపై కొనసాగుతున్న దర్యాప్తు
క్యాబ్ అగ్రిగేటర్ల విషయంలో కేంద్రం చర్యలు Rapidoకే పరిమితం కాలేదు. Uber, Ola వంటి సంస్థల వ్యాపార విధానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని నిధి ఖరే తెలిపారు. భారత్లో పనిచేస్తున్న క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్ల వ్యాపార విధానాలను పరిశీలించేందుకు CCPA రంగాల వారీగా దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా రైడ్ ప్రారంభానికి ముందే అదనపు టిప్ చెల్లించేలా చేసే విధానాలు, డైనమిక్ ప్రైసింగ్ తదితర అంశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే Uber, Ola, Rapido, Namma Yatri సహా పలు ప్లాట్ఫామ్లకు CCPA నోటీసులు జారీ చేసింది. 2023లో రూపొందించిన Dark Patterns మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది.
Rapidoకు రూ.10 లక్షల జరిమానా
రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై అదనంగా డబ్బు చెల్లించేలా ఒత్తిడి తెచ్చే విధానాలపై CCPA Rapidoను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో Rapidoను నిర్వహించే Roppen Transportation Services Pvt Ltdకు రూ.10 లక్షల జరిమానా విధించింది.

