కరోనా సెకండ్ వేవ్ ఎఫ్టెక్ట్తో వాయిదా పడుతూ వచ్చిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు.. కేబినెట్ మంత్రులు, ఉన్నాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.. గత ఏడాది మాదిరే ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు మార్కులు వేయనున్నారు.. కరోనా సమయంలో.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.. విద్యార్థులు ఆరోగ్యం, భద్రత చాలా ముఖ్యమని.. ఈ అంశంపై ఎటువంటి రాజీ ఉండబోదని.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో.. భయాందోళనల మధ్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇక, సీబీఎస్ఈ పరీక్షలపై ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపుల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరు భాగస్వాముల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని.. కోవిడ్ కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అందరి అభిప్రాయాలను అనుగుణంగా.. పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని నిర్ణయించారు. ఇప్పటివరకు నిర్వహించిన ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను సంకలనం చేయడానికి సిబిఎస్ఈ చర్యలు తీసుకుంటుందని కూడా నిర్ణయించారు. ఇక, సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలపై నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు లోబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. కరోనా వైరస్ అకాడెమిక్ క్యాలెండర్ను ప్రభావితం చేసిందని.. బోర్డు పరీక్షలు.. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులలో విపరీతమైన ఆందోళన కలిగించిందని.. దీనికి తప్పనిసరిగా ముగింపు పలకాల్సిందేనని పేర్కొన్నారు ప్రధాని. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మైక్రో కంటైన్మెంట్ ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారి.. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయని… ఇలాంటి పరిస్థితిలో విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతున్నారని.. అటువంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో విద్యార్థులు బలవంతంగా పరీక్షలకు హాజరుకావద్దని ప్రధాని అన్నారు.