దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది.
ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గట్టిగానే స్పందించారు. ఏకంగా యమునా నీటిని తాగి విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
తాజాగా షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కేజ్రీవాల్ పై కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.