తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీల ప్రివిలైజ్ మోషన్ పై స్పందించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ ను లూటీ చేస్తున్నారు. తానే ఒక రాజు అనుకొని కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. కేసీఆర్ ప్రజలకు చేస్తున్నది ఏం లేదు ప్రజలు అన్ని రకాలుగా బాధలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారన్నారు తరుణ్ చుగ్.
