త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వలసలు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిలేష్ యాదవ్ ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది.
Read Also: ఆంక్షలు ఎత్తివేసే ఆలోచనలో ఢిల్లీ ప్రభుత్వం
మంగళవారమే మంత్రి స్వామిప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేసి అఖిలేష్ పార్టీలో చేరగా… కొన్ని గంటల వ్యవధిలోనే మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సమాజ్వాదీ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్య ఉన్నారు. వీరంతా స్వామి ప్రసాద్ సన్నిహితులు కావడం గమనార్హం. ఆయన ప్రోద్బలంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీలో చేరారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను రాజీనామా చేయడానికి దళితులపై బీజేపీ చిన్నచూపే కారణమని మంత్రి స్వామి ప్రసాద్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
