Mamata Banerjee: హిందూ పండగకు సెలవు రద్దు, రంజాన్‌కి కేటాయింపు.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్

  • కొత్త వివాదంలో మమతా బెనర్జీ..
  • వివాదంగా మారిన విశ్వకర్మ పూజ సెలవు రద్దు..
  • రంజాన్‌కి కేటాయించడంపై బీజేపీ ఆగ్రహం..
  • చివరకు వెనక్కి తగ్గిన బెంగాల్ ప్రభుత్వం..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. మున్సిపల్ పాఠశాలల్లో ‘‘విశ్వకర్మ పూజ’’కు సెలవును రద్దు చేసి, ఈ సెలువు దినాన్ని ‘‘రంజాన్’’ పండగకు కేటాయించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈద్‌కి ఒకటికి బదులుగా రెండు రోజులు సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది.

Read Also: Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..

ఈ ఉత్తర్వులను కోల్‌కతా మేయర్, రాష్ట్ర మంత్రిగా ఉన్న ఫిర్హాద్ హకీమ్ ఫిబ్రవరి 25న జారీ చేశారు. దీనిపై బీజేపీ, అధికార టీఎంసీని తీవ్రంగా విమర్శిస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ మాట్లాడుతూ.. ‘‘మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాల కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోంది’’ అని ఆరోపించారు. ప్రభుత్వం ముస్లింలను ఏకపక్షంగా చేర్చడం ద్వారా, ఓబీసీ రిజర్వేషన్లను మార్చడానికి ప్రయత్నించిందని, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు అందకుండా చేసిందని ఆరోపించారు.

హిందువులు, ముఖ్యంగా ఓబీసీలకు విశ్వకర్మ పూజ చాలా ప్రాముఖ్యత కలిగింది. బీజేపీ నేత అమిత్ మాల్వీయా కూడా మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మమతా బెనర్జీ తన స్నేహితుడు, ఆధునిక సుహ్రావర్డీ అయిన ఫిర్హాద్ హకీమ్, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విశ్వకర్మ పూజ కోసం సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, బెంగాల్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అనుకోకుండా జరిగిన తప్పిదంగా పేర్కొంటూ ఉపసంహరించుకుంది.