Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం

  • రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • కీలక నేతలకు అవకాశం
  • ఈనెల 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు
Bjp

Bjp

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు అవకాశం కల్పించింది.

మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో పాటు రజనీష్ అగర్వాల్‌ను కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశాలో ఇటీవల బీజేడీని వీడి బీజేపీలో చేరిన మాజీ నేత దేవాశిష్ సామంత్రాయ్‌ను ఉప ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై తగక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాథ్వా, మాన్సింగ్ పర్మార్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్‌లో ఆల్కా గుర్జర్, సతీశ్ పూనియాలకు బీజేపీ అవకాశం కల్పించింది. మణిపూర్ నుంచి ఏ. శారదా దేవిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

×
×
Ad

దేశవ్యాప్తంగా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో ఇటీవలే బీజేపీలో చేరిన దేవాశిష్ సామంత్రాయ్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ తన విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

27 రాజ్యసభ స్థానాల్లో పోలింగ్..

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 27 రాజ్యసభ స్థానాలకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.