Bengaluru: బాత్రూమ్‌లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!

  • బెంగళూరులో దారుణం
  • బాత్రూమ్‌లో మహిళ అస్థిపంజరం
  • ఏడాదిన్నర క్రితమే మృతి చెందినట్లు అనుమానం
Bengaluru

Bengaluru

బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని హవనూర్ లేఅవుట్‌లో ఓ ఇంటి బాత్రూమ్‌లో 50 ఏళ్ల మహిళ అస్థిపంజరం కనిపించింది. ఆమె దాదాపు ఏడాదిన్నర క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె మరణించిన విషయం ఇంతకాలం బయటకు రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతురాలిని దాక్షాయిణిగా పోలీసులు గుర్తించారు. ఉత్తర బెంగళూరులోని బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 7న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒంటరిగానే జీవనం..

పోలీసుల వివరాల ప్రకారం.. దాక్షాయిణి కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె భర్త ఉమేశ్ సుమారు పదేళ్ల క్రితమే మృతి చెందారు. కుమారుడు కూడా అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా ఆమె కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. ఆగస్టు 7న రాత్రి సుమారు 8 గంటల సమయంలో దాక్షాయిణి ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లో దొంగతనం జరిగి ఉండొచ్చని అనుమానించిన వారు వెంటనే అత్యవసర నంబర్ 112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలించగా.. బాత్రూమ్‌లో అస్థిపంజర అవశేషాలు కనిపించాయి.

సోదరుడికి సమాచారం..

ఈ ఘటనపై పోలీసులు దాక్షాయిణి సోదరుడు మహేశ్ బసప్పకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని అస్థిపంజర అవశేషాలు తన సోదరివేనని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరి మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె మృతికి మరెవరూ కారణమై ఉండొచ్చని తాను భావించడం లేదని మహేశ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

పోలీసుల విచారణలో మహేశ్ పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. 2005లో కుమారుడు మరణించిన తర్వాత దాక్షాయిణికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు, శివమొగ్గలోని ఆస్పత్రుల్లో ఆమెకు చికిత్స అందించారని, వైద్యులు స్కిజోఫ్రెనియాగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆమె సుమారు నాలుగు నెలల పాటు ఓ పునరావాస కేంద్రంలో కూడా చికిత్స పొందినట్లు పోలీసులు వెల్లడించారు.

దాక్షాయిణి మృతదేహం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయిన నేపథ్యంలో ఆమె మరణానికి కచ్చితమైన కారణం, సమయం తెలుసుకునేందుకు పోలీసులు అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కు పంపించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద అసహజ మరణ నివేదిక నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎప్పుడు, ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.