Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ.

Bengalore

Bengalore

Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయింది. దీంతో నగరం అంతా వరద పరిస్థితి నెలకొనడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్ర నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాల వల్ల ఒకరు మరణించారు. నగర వ్యాప్తంగా చెరువులు పొంగిపోర్లుతున్నాయి. బెంగళూర్ లో సెప్టెంబర్ 1 మరియు 5 మధ్య సాధారణం కంటే 150 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి. మహదేవపురం, బొమ్మనహళ్లి, కెఆర్ పురంలలో 307 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత 42 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని, బెంగళూరులోని మొత్తం 164 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండాయని సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు.

Read Also: IND Vs SL: కెప్టెన్ రోహిత్ శర్మ ఒంటరి పోరు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ఇదిలా ఉంటే రాబోయే 3 రోజుల పాటు నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో రాబోయే 2 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే వర్షంలో చిక్కుకున్న వారిని కష్టాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే కిలోమీటర్ కు రూ. 200 వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. అత్యంత ఖరీదైన కార్లు నీట మునిగాయి. బెంగళూర్ వరదలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కారణంగానే వరదలు సంభవించాయని సీఎం బస్వరాజ్ బొమ్మై ఆరోపించారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. బీజేపీ ప్రభుత్వం, అధికారులే వరదలకు కారణం అని.. దైర్యం ఉంటే ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీకి సవాల్ విసిరారు.