Bengal Political Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం పాలై రెండు రోజులు గడుస్తున్నా, రాజకీయ నాటకం మాత్రం ఇంకా ముగియలేదు. రాష్ట్రంలో బీజేపీ తన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుండగా, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి మమతా బెనర్జీ మాత్రం మొండిగా నిరాకరిస్తున్నారు.
నో రాజీనామా..
సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు పాత ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే మమతా బెనర్జీ మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రభుత్వం మమతతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భద్రతను భారీగా తగ్గించింది. మమత పక్కకు తప్పుకోకపోయినా, ఆమె హయాంలో కీలక పదవులు అనుభవించిన సలహాదారులు, మాజీ అధికారులు మాత్రం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శులు అలపన్ బంద్యోపాధ్యాయ్, హెచ్కే ద్వివేది, మనోజ్ పంత్ తాజాగా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఆర్థికవేత్త అభిరూప్ సర్కార్ కూడా తన రాజీనామాను సమర్పించారు. “నన్ను మమతా బెనర్జీ నియమించారు. ఆమె ఓడిపోయారు కాబట్టి, నేను ఈ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు లేదు” అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా సైతం గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపారు.
బీజేపీ విజయ విహారం..
రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి స్పష్టమైన మెజారిటీ సాధించింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, మే 9న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించడానికి టీఎంసీ నిరాకరించగా, బీజేపీ మాత్రం మమతపై విమర్శల దాడి పెంచింది. “అధికారులందరికీ కనీస నైతికత ఉంది కాబట్టి రాజీనామా చేశారు. కానీ మమతకు మాత్రం ఆ సిగ్గు లేదు. సొంత గడ్డపైనే ఓడిపోయినా ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు” అని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఎద్దేవా చేశారు. మొత్తానికి బెంగాల్లో అధికార మార్పిడి ఉత్కంఠభరితంగా సాగుతోంది. మే 9న జరిగే ప్రమాణ స్వీకారంతో ఈ రాజకీయ అనిశ్చితికి తెరపడనుందో లేదో వేచి చూడాలి.
