Belgium: బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ చైనా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై ఆర్థికంగా అతిగా ఆధారపడతటం వల్ల యూరప్ ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే భారత్ గుర్తించి యూరప్ను హెచ్చరించినప్పటికీ, అప్పట్లో తాము దీనిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన బెల్జియం ప్రధాని డివెవర్, ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యక్రమంలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
చౌక విదేశీ వస్తువులు తమ మార్కెట్లను ముంచెత్తడాన్ని యూరప్ చాలా కాలంగా అనుమతించిందని, దీంతో స్థానిక పరిశ్రములు కుంటుపడ్డాయని, అదే సమయంలో కీలక వస్తువులు, సరఫరా కోసం యూరప్ ఇతర దేశాలపై మరింతగా ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, బెల్జియం ప్రధాని చైనా పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, పెరుగుతున్న చైనా ఆర్థిక ప్రభావం, యూరప్ మార్కెట్లో చౌకైన చైనా వస్తువుల గురించి భావించవచ్చు.
యూరప్ కన్నా ముందుగానే భారత్ ఈ సమస్య గురించి హెచ్చరించిందని, కానీ ఆ సమయంలో మేము వినలేదని ఒప్పుకున్నారు. అతిగా ఆధారపడటం చివరకు రాజకీయ ఒత్తిడికి ఆయుధంగా మారే ప్రమాదం ఉందని బెల్జియం ప్రధాని అన్నారు. భారత ప్రధాని మోడీ చాలా కాలం క్రితమే ఈ మాట చెప్పారని గుర్తుచేసుకున్నారు. భౌగోళిక-రాజకీయ అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో భారత్ను బెల్జియం అత్యంత ముఖ్యమైన, విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని డి వెవర్ చెప్పారు. మా జాబితాలో భారత్ నంబర్-1 అని, భారత్ లిస్టులో లేకపోతే ఒక ప్రాథమిక విషయాన్ని కోల్పోయినట్లే అవుతుందని ఆయన అన్నారు. భారత్-బెల్జియం సంబంధాలను ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక రంగాల్లో “మరో స్థాయికి” తీసుకెళ్లాలని తమ దేశం కోరుకుంటోందని ఆయన తెలిపారు.

