NTV Telugu Site icon

Bangladesh: పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌కి పెరిగిన స్నేహం.. భారత్ ఆందోళనలు ఏమిటి.?

Pak Bangla

Pak Bangla

Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి చాలా దగ్గరైంది. 1971 విముక్తి ఉద్యమంలో లక్షలాది మంది బెంగాలీలను చంపిన ఉదంతాన్ని మరిచిపోయి, పాక్‌తో స్నేహం చేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి కారణమైన భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని హిందూ మైనారిటీలపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న అభ్యర్థనను కూడా యూనస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

పాక్-బంగ్లా చెట్టాపట్టాల్:

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) నేతలు భారత్‌కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, పాక్‌కి దగ్గరవుతున్నారు. నిజానికి ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మన్ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నుంచి తొలగించారు. ఇటీవల ఢాకాలో జరిగిన ఓ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నాని తమ జాతిపితగా పొగిడారు. ఇదిలా ఉంటే ఇప్పుడు, బంగ్లాదేశ్ పాక్ జాతీయులకు వీసా నిబంధనల్ని సులువు చేసింది. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండా పాక్ జాతీయులు బంగ్లాదేశ్‌కి రావచ్చు.

మరోవైపు పాక్ నుంచి నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. ఇస్లామాబాద్ నుంచి 25,000 టన్నుల చక్కెరని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 47 ఏళ్ల తర్వాత ఇరు దేశాలు సముద్ర మార్గాన్ని రీ ఓపెన్ చేశాయి. కరాచీ నుంచి చిట్టగాంగ్‌కి ఇటీవల కార్గో షిప్ వచ్చింది. ఇదే కాకుండా ఎప్పుడూ లేని విధంగా యూనస్ ప్రభుత్వం పాక్ నుంచి 40 టన్నుల ఆర్డీఎక్స్, 2900 హై ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్స్, 2000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రి, 40,000 అర్టిలరీ మందుగుండు సామాగ్రిని ఆర్డర్ చేసింది.

Read Also: Sonia Gandhi: జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థతో సోనియాగాంధీకి సంబంధం..

భారత్ ఆందోళనలు ఏమిటి..?

షేక్ హసీనా ఉన్నంత కాలం బంగ్లాదేశ్‌ని భారత వ్యతిరేక ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఉక్కుపాదం మోపింది. ఎప్పుడైతే ఆమెని పదవీ నుంచి దించిన తర్వాత యూనస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వంలో జమాతే ఇస్లామి, బీఎన్పీ, షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన ఇస్లామిక్ ఛత్రశిబిర్ ఉన్నాయి. వీరంతా భారత్‌కి వ్యతిరేకంగా ప్రతీరోజు ఆందోళనలు చేపడుతున్నారు. హిందువులపై దాడుల్లో జమాతే ఇస్లామీ పాత్ర అధికంగా ఉంది.

షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన జమాతే నాయకులు ఒక్కొక్కరిగా దేశం చేరుకుంటున్నారు. దీంతో రానున్న కాలంలో అక్కడ మరింత ఇస్లామిక్ మతోన్మాదం బలపడే అవకాశం ఉంది. దీంతో పాటు పాక్‌కి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కి ఉగ్రవాద, రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదం మరింత బలపడబోతుందనేది సుస్పష్టం.

నిజానికి పాకిస్తాన్‌కి ప్రాక్సీగా జమాతే ఇస్లామీ పనిచేస్తోంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ఇది పనిచేస్తుంది. దీని కింద అన్సరుల్లా బంగ్లా, జమాత్ ఉల్ ముజాహీద్దిన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. నిజానికి గతంలో 1991-96, 2001-205 మధ్య జమాత్ మద్దతు కలిగిన బీఎన్పీ పార్టీ షేక్ ఖలిదా జియా అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ టెర్రరిజానికి బంగ్లాదేశ్‌తో లింకులు ఏర్పడ్డాయి.

మసూద్ అజార్, సజ్జాద్ ఆఫ్ఘని వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు కీలకంగా మారింది. IC-814 ఫ్లైట్ కాందహార్ హైజాకింగ్‌లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్న నలుగురు జైష్ ఉగ్రవాదులతో పాటు స్థానిక జైష్ కార్యకర్త బిలాల్ మోండల్‌ని బంగ్లాదేశ్ అధికారులు 2009లో అరెస్ట్ చేశారు. ఇక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కూడా బంగ్లాదేశ్‌లో బలపడే అవకాశం ఉంది.

చిట్టగాంగ్, కాక్స్ బజార్‌లోని రోహింగ్యా సెటిల్మెంట్లలో ఇప్పటికే లష్కరే కార్యకర్తలు పనిచేయడం ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లో, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ULFA) వంటి భారత వేర్పాటువాద ఉగ్రసంస్థలకు కూడా బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తోంది. వీరికి తీవ్రవాద గ్రూపులు శిక్షణ కూడా ఇస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా లష్కర్ రోహింగ్యాలను రిక్రూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఎల్‌ఈటీ, అల్‌ఖైదా జిహాదీ కమాండర్లు రోహింగ్యా క్యాంపులను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇలా టెర్రరిస్టులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లా, బెంగాల్ ప్రాంతంలో అత్యంత సున్నితమైన ‘‘చికెన్ నెక్’’ లేదా ‘‘సిలిగురి కారిడార్’’‌ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో చొరబాట్లు, బంగ్లా ముస్లింల జనాభా పెరగడం గమనించవచ్చు.