Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?

  • రాముడి గుడిలోనే దగా
  • రామ మందిర్‌లో ‘జాబ్ రాకెట్’..
  • సిట్ విచారణలో సరికొత్త స్కాం వెలుగులోకి
  • 125 మంది నియామకాలపై ‘SIT’ నిఘా
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. విరాళాల చోరీ కేసును ఛేదించే పనిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు.. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది. రామ మందిరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిందితులు పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ట్విస్ట్ ఇచ్చిన నిందితుడి విచారణ..

ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాను దర్యాప్తు సంస్థలు విచారించగా, కేసు విచారణనే మార్చేసే కీలక విషయాలు బయటపడ్డాయి. విచారణలో రామ్ మందిర్ ట్రస్ట్‌కు చెందిన ఒక ముఖ్య సభ్యుడి పేరు పదేపదే ప్రస్తావనకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆలయ నియామకాల్లో సదరు ట్రస్ట్ సభ్యుడి పాత్ర ఏమైనా ఉందా? అతని అండతోనే ఆర్థిక అవకతవకలు జరిగాయా? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.

125 నియామకాలపై నిఘా

రామ మందిర ప్రతిష్ఠాన్‌లోని వివిధ విభాగాలలో సుమారు 125 మంది ఉద్యోగులను అక్రమ పద్ధతిలో నియమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందినట్లు భావిస్తున్న వీరి రికార్డులను పోలీసులు తనిఖీ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రాథమిక విచారణలో చాలా మంది ఉద్యోగులకు సంబంధించిన అధికారిక నియామక పత్రాలు, సేవా ఒప్పందాలు లేదా ఇతర అవసరమైన డాక్యుమెంట్లు వెంటనే అందుబాటులో లేవని తేలింది. దీంతో ఇవి అక్రమంగా జరిగిన పెద్ద రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నియామకాలకు అసలు ఏ స్థాయిలో ఆమోదం లభించింది? ఎవరి ఆదేశాల మేరకు వీరంతా విధుల్లో చేరారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు సిట్ బృందం సిద్ధమైంది. అనుమానితుల బ్యాంకు రికార్డులలో ఉద్యోగ నియామకాలకు ముందు, తర్వాత జరిగిన అసాధారణ నగదు బదిలీలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో పేరు వచ్చిన ఆ ట్రస్ట్ సభ్యుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని ఆస్తుల్లో వచ్చిన మార్పులపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.

నిందితుల ఫ్యామిలీ కనెక్షన్స్..

ఇప్పటికే విరాళాల దొంగతనం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రాలను కూడా ఈ ఉద్యోగాల స్కామ్ దర్యాప్తులోకి లాగారు. ఈ ఇద్దరు నిందితులకు ట్రస్ట్ సభ్యులతో ఏవైనా కుటుంబ సంబంధాలు ఉన్నాయా, ఆ రికమండేషన్లతోనే ఈ 125 మందికి ఉద్యోగాలు ఇప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నియామక లోపాలు, నిందితుల వాంగ్మూలాలను ‘సిట్’ తన సమగ్ర నివేదికలో పొందుపరచనుంది. ఈ నివేదిక అధికారికంగా బయటకొస్తే అయోధ్య ట్రస్ట్‌లో మరికొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రావడం ఖాయమని అంతర్గత వర్గాల సమాచారం.