Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు భక్తులు సమర్పించిన కానుకల చోరీ ఉదంతం ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ భారీ అక్రమాలపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై గురిపెట్టారు. ఇందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా మొత్తం 6 నుంచి 7 ప్రముఖ బ్యాంకులకు పోలీసులు అఫీషియల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ట్రస్ట్కు సంబంధించిన ప్రధాన బ్యాంక్ ఖాతాలు, లాకర్ల వివరాలతో పాటు ఇటీవల జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల రికార్డులను తక్షణమే సమర్పించాలని పోలీసులు ఆయా బ్యాంకులను ఆదేశించారు. భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము ఏ ఏ అకౌంట్లలోకి బదిలీ అయింది? ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో ‘ట్రాన్సాక్షన్ ట్రైల్’ ద్వారా నిధుల కదలికలను దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఎస్బీఐ మేనేజర్ల విచారణ..
రామమందిర ట్రస్ట్కు చెందిన ప్రధాన బ్యాంక్ ఖాతా నడుస్తున్న అయోధ్యలోని ఎస్బీఐ ‘నయా ఘాట్’ బ్రాంచ్కు పోలీస్ ప్రత్యేక బృందం వెళ్లింది. క్యాష్ కౌంటింగ్, హ్యాండ్లింగ్, బ్యాంక్కు నిధుల బదిలీ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే బ్యాంక్ మేనేజర్ను కూడా విచారించి, ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం బ్యాంక్ లావాదేవీల రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, క్యాష్ మూవ్మెంట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్బీఐ ఉద్యోగుల అరెస్ట్..
ఈ విరాళాల లెక్కింపు, భద్రత, బ్యాంక్కు తరలింపు ప్రక్రియలో కొందరు బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్బీఐ పేరోల్పై పనిచేస్తున్న రత్నేష్, గగన్దీప్ అనే ఇద్దరు ఉద్యోగులతో పాటు వారి కింద ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యోగులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల్లో సుభాష్, టీన్నూ మినహా మిగిలిన వారంతా ఔట్సోర్సింగ్ స్టాఫ్గా గుర్తించారు. నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, చాట్ హిస్టరీపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ రికార్డులు పూర్తిగా బయటపడితే ఈ స్కామ్లో మరికొంతమంది పెద్ద తలకాయల గుట్టు వీడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

