Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎంతో విషాదం మిగిల్చింది. వందలాది మందికి కుటుంబాలను లేకుండా చేసింది. ఇంతటి విషాదం మిగిల్చిన ప్రమాదాన్ని సైతం కొందరు స్వార్థపరులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారికి రిజర్వేషన్ చేయించుకున్న వారికి, టికెట్ తీసుకున్న వారికి.. చివరికి టికెట్ లేకుండా ప్రయాణించిన వారికి సైతం నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొందరు దురాశాపరులు తమ చేతివాటం చూపిస్తున్నారు.
Read also: Lifestyle : పెళ్లయిన మగవాళ్ళు వేరే స్త్రీలను ఎందుకు ఇష్ట పడతారో తెలుసా?
ఒడిషా ప్రమాదం 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే.. వీరిలో చాలామంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం మరో విషాదం. ఇలా గుర్తు పట్టలేని వారిని గుర్తుపట్టాలని మృతదేహాల ఫొటోలను తీసి వెబ్సైట్లో ఉంచారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న కొందరు స్వార్థపరులు కొత్త నాటకానికి తెర లేపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కొట్టేసేందుకు చనిపోయింది తమ వాళ్లేనంటూ నకిలీ డాక్యుమెంట్లతో శవాలను తీసుకెళ్లిపోతున్నారు. తాజాగా ఈ మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా (35) తన భర్త బిజయ్ దత్తా (40) కనిపించడం లేదని బహనగకు వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడని, అప్పట్నుంచి తన ఆచూకీ తెలియట్లేదని పోలీసులకు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాద బాధితులను తరలించిన ఆస్పత్రులకు కూడా వెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన భర్త అని చెప్పింది.
Read also: MLC Kavitha: కల్వకుంట్ల కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవండి
డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు గీతాంజలి ఆధార్ కార్డ్ను అందజేసింది. అయితే అందులో గీతాంజలి వయస్సు 60 ఏండ్లుగా ఉంది. కానీ ఆమె అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించలేదు. పైగా ఆమె ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆధార్ కార్డ్ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించారు. అప్పుడు గీతాంజలి భర్త బిజయ్ బతికే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు అతను కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించలేదని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలతో వచ్చానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.