NTV Telugu Site icon

Assam: ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కుట్ర భగ్నం..11 మంది అరెస్ట్

Assam Terror Module

Assam Terror Module

దేశంలో మరో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.

Read Also: Manisha Ropeta: పాకిస్తాన్‌ పోలీస్ శాఖలో హిందూ మహిళకు అందలం.. తొలి మహిళగా రికార్డ్

ఆల్ ఖైదా, అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్నాయని అస్సాంలోని మోరిగావ్, బార్పేట, గౌహతి, గోల్ పురా జిల్లాల నుంచి వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసులు తెలిపారు. గురువారం వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముస్తపా అలియాస్ ముఫ్తీ ముస్తాఫా మోరిగావ్ జిల్లాలోని సహారియా గావ్ నివాసి.. ఇతడు అన్సరుల్లా బంగ్లా టీంలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇతను మదరసాలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ.. నిధులు సమకూరుస్తున్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఇతనితో పాటు అఫ్సరుల్లా భుయాన్, అబ్బాస్ అలీ, మోహబూబుర్ రెహమాన్, జుబైర్ ఖాన్ , రఫీకుల్ ఇస్లాం , దేవాన్ హమీదుల్ ఇస్లాం , మొయినుల్ హక్ , కాజీబుర్ హుస్సేన్, ముజిబౌర్ రెహమాన్, షాహనూర్ అస్లాం, సహజహాన్ అలీని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దాడుల్లో నిందితుల వద్ద నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, నేరారోపణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరి నుంచి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. కేంద్ర నిఘా ఏజెన్సీలు, అస్సాం పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్ర మాడ్యుల్ బయటపడిందని స్పెషన్ డీజీపీ జీపీ సింగ్ వెల్లడించారు.