క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆ కేసులో ఉండడం వల్ల, అది జాతీయంగా సెన్సేషన్ అయి కూర్చుంది. ఈ కేసులో ఆర్యన్ కొన్ని వారాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో అతడ్ని ఎన్నోసార్లు విచారించారు. షారుఖ్ ఖాన్ సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 28న ఆర్యన్కు ఈ కేసు నుంచి విముక్తి కలిగింది. ఇప్పటివరకూ ఈ కేసుపై ఆర్యన్ నోరు విప్పలేదు. ఎట్టకేలకే తొలిసారి పెదవి విప్పాడు.
ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్తో చేసిన ఇంటర్వ్యూలో ఆర్యన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘‘అన్ని విషయాలు చెప్తే, నిర్దోషిగా బయటకొస్తావ్’’ అని సంజయ్ సింగ్ చెప్తుండగా.. ఆర్యన్ మధ్యలో కలగజేసుకుని తన మనసులోని ఆవేదనను వెళ్లగక్కాడు. ‘‘సర్, నా మీద మీరు ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్ అనే ముద్ర వేశారు. డ్రగ్ ట్రాఫికింగ్కు ఆర్థిక సాయం చేస్తున్నానని అన్నారు. ఈ ఆరోపణలన్నీ మీకు వెగటుగా అనిపించట్లేదా? ఆ రోజు నా దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. అయినా నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. తప్పు చేయకపోయినా.. నేను తప్పు చేశానన్నారు. నా పేరు ప్రతిష్ఠల్ని నాశనం చేశారు. నేనెలాంటి తప్పు చేయకపోయినా, అన్ని వారాలు జైలులో ఎందుకుండాలి? నిజంగా నాకు ఆ శిక్ష పడాలా?’’ అని ఆర్యన్ ఖాన్ ప్రశ్నించాడు.
కాగా.. ఈ సందర్భంగానే దర్యాప్తు సమయంలో షారుఖ్ తీవ్ర మనోవేదన అనుభవించారని సంజయ్ సింగ్ చెప్పారు. ఆర్యన్ ఖాన్ మానసిక ఆరోగ్యంపై చాలా కలత చెందారని, జైలులో ఆర్యన్ ఖాన్ బెడ్ వరకు వెళ్లి రాత్రంతా తోడుగా ఉండేవారని పేర్కొన్నారు. తన కొడుకు వద్ద డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. నేరస్థుడిగా మార్చారంటూ వాపోయారన్నారు. అందరూ తమను రాక్షసుల్లాగా, కరుడుగట్టిన నేరస్థుల్లాగా చూశారంటూ షారుఖ్ ఆవేదన వ్యక్తం చేశారని సంజయ్ సింగ్ వెల్లడించారు.
