NTV Telugu Site icon

Sunita kejriwal: హర్యానాలో సునీతా ఎన్నికల ప్రచారం.. మోడీకి కేజ్రీవాల్ తలవంచరని వ్యాఖ్య

Sunitakejriwal

Sunitakejriwal

ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని విమర్శించారు. హర్యానా కోడలుగా సునీతా కేజ్రీవాల్ పరిచయం చేసుకున్నారు. బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని విమర్శలు గుప్పించారు.

కేజ్రీవాల్ చేసిన పనుల వల్లే హర్యానా పేరు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు. హర్యానా బాలుడు ఢిల్లీ సీఎం అవుతాడని ఎవరూ ఊహించలేదన్నారు. కృష్ణ జన్మాష్టమి రోజున కేజ్రీవాల్ పుట్టారని, ప్రత్యేక పనికి భగవంతుడు ఆయనను ఉద్దేశించాడని చెప్పారు. కానీ హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేసిందని సునీత నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలు కానీ, పిల్లల విద్య కానీ మెరుగైందా అని సునీత ప్రశ్నించారు. కనీసం మంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయా? మందులు, చికిత్స ఉచితంగా అందుతోందా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీజేపీకి వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ ఆప్‌కు ఓటు వేసి కేజ్రీవాల్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే రెండు రాష్ట్రాల్లో నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సాధ్యమైందన్నారు. అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చక్కగా పనిచేస్తున్నాయని వివరించారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా అందిస్తున్నామని… వృద్ధులకు తీర్థయాత్ర పర్యటనకు ఏర్పాట్లు చేశామన్నారు.

హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేశాయి. ఆప్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.