NTV Telugu Site icon

Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు. బీజేపీని టార్గెట్ చేస్తూ, ఈ వ్యక్తులు రాజ్యాంగం కన్నా శక్తివంతులు కారని అన్నారు. నాయకులను జైలులో పెట్టడమే కాకుండా ప్రజల్ని వేధించే ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతీ వ్యక్తి పోరాడాలని అన్నారు.

జైల్లో ఉన్నప్పుడు తనకు బెయిల్ ఎప్పుడు వస్తుందనే ఆలోచన లేదని, అయితే బీజేపీకి డబ్బులు విరాళంగా ఇవ్వనందకు వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలులో పెట్టడం చూస్తుంటే బాధగా ఉందని చెప్పారు. ఈ కేసులో జైలులో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలంతా ఒక్కటైతే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు.

Read Also: Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?

సిసోడియా మాట్లాడుతూ.. మేము రథానికి గుర్రాలమే, కానీ మా నిజమైన సారథి జైలులో ఉన్నారని త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. తన బెయిల్ తీర్పుపై మాట్లాడుతూ నియంతృత్వాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం యొక్క అధికారాన్ని ఉపయోగించిందని చెప్పారు. 7-8 నెలల్లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ 17 నెలలు పట్టిందని చెప్పారు. కానీ చివరకు నిజం గెలించిదని అన్నారు. వినేష్ ఫోగట్‌‌ ఒలింపిక్స్ అనర్హత గురించి నేరుగా ప్రస్తావించకుండా, ఆమె తన నాయకుడికి ఎదురుతిరిగింది, ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో చూశారు కదా అని కార్యకర్తలతో ఆయన అన్నారు. మహిళల 50 కేజీల ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్‌పై పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.