అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఆర్మీకి చెందిన రెండు షెల్టర్లు వరదల్లో కొట్టుకుపోవడంతో ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. మరోవైపు అప్పర్ సుబాన్సిరి జిల్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు శుక్రవారం సాయంత్రం భారీ వర్షాల అనంతరం చోటుచేసుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని కియోజారింగ్-బ్యాచింగ్ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో టాడు బాకీ, తాజీ రాయ్, మార్కోష్ బసుమతారి, బాబుల్ అలీ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు బాబుల్ అలీ మృతదేహాన్ని మాత్రమే వెలికితీసినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాచో పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఘటనాస్థలికి తరలించారు. దపోరిజో నుంచి ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలను కూడా రంగంలోకి దించారు. సహాయక చర్యల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం కూడా పాల్గొంటోంది.
దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పసు పాని ఆర్మీ క్యాంప్ వద్ద భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 5వ గ్రెనేడియర్స్కు చెందిన రెండు షెల్టర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సమయంలో మొత్తం ఏడుగురు ఆర్మీ సిబ్బంది వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరిని సురక్షితంగా రక్షించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని హవల్దార్ ఉపేందర్, కుందన్, వినోద్, ఆదిత్య, సముందాగా గుర్తించారు.
గల్లంతైన సైనికుల కోసం ఆర్మీ రెండు సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. 5వ గ్రెనేడియర్స్ సిబ్బందితో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 58వ బెటాలియన్, జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (GREF)కు చెందిన 62 రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (RCC) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు, స్థానిక వాలంటీర్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలకు సహకరిస్తున్నారు. పాసిఘాట్ నుంచి మరో ఎస్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ను మరింత బలోపేతం చేసేందుకు అనిని వైపు బయలుదేరింది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు రెస్క్యూ సిబ్బందికి సవాలుగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.

