దివంగత మాజీ సీఎం జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు. దీంతో ఈనెల 21న పన్నీర్ సెల్వం విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం నివసించిన శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ సమయంలో ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. కాగా జయలలిత మృతి కేసులో రెండు రోజులుగా అపోలో వైద్యులు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
