Love Affair: ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్ని ఘోరంగా హత్య చేశాడు.
తన కుమార్తె ప్రేమ ఇష్టం లేని వ్యక్తి, ఆమెను, ఆమె లవర్నిని పారతో నరికి చంపాడు. ఘటన తర్వాత రక్తంతో తడిసిన ఆయుధంతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు. ప్రాథమికంగా పరిశీలిస్తే ఇది పరువు హత్యగా పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే… పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20) అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20)ను రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, ఈ వ్యవహారం గురించి తెలిసిన కుటుంబీకులు దీనికి ఒప్పుకోలేదు. ప్రేమికులను విడదీసేందుకు చాలా సార్లు కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున సచిన్, నీతూ ఇద్దరు నీతూ ఇంటిలో కలుసుకున్న సమయంలో ఏదో శబ్ధం వినిపించి నీతూ కుటుంబీకులు తెల్లవారుజామున 4.30 గంటలకు మేల్కొన్నారు. వీరిద్దరిని చూసిన వారు దాడి చేశారు.
మొదటగా ప్రేమికులపై దాడి చేశారు. ఆ తర్వాత నీతూ తండ్రి మహేష్ పారతో దాడి చేసి చంపినట్లు ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. ఘటన తర్వాత అమ్మాయి కుటుంబీలకు అక్కడ నుంచి పారిపోగా.. మహేష్ బిల్సీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సచిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిపై హత్యానేరాన్ని నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
