Amruta Fadnavis: టీసీఎస్ నాసిక్ ఘటనపై దేవేంద్ర ఫడ్నవిస్ భార్య కీలక వ్యాఖ్యలు

  • దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీసీఎస్ నాసిక్ వివాదం
  • నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పోలీసులు
  • నాసిక్ ఘటనపై దేవేంద్ర ఫడ్నవిస్ భార్య కీలక వ్యాఖ్యలు
Amrutafadnavis

Amrutafadnavis

దేశ వ్యాప్తంగా టీసీఎస్ నాసిక్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూనిట్‌లో జరిగిన లైంగిక దోపిడీ, మత మార్పిడిపై పెద్ద దుమారం రేగుతోంది. హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముస్లిం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన మహిళా నిందితురాలి కోసం కూడా గాలిస్తున్నారు. ఆమె జాడ కోసం జల్లెడ పడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ స్పందించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను యాక్సిస్ బ్యాంక్‌లో పని చేసినప్పుడు తనకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అయినా కార్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు చాలా తీవ్రమైనవని.. ఆందోళనకరమైనవిగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని మహిళలకు అమృత ఫడ్నవిస్ సూచించారు. కార్యాలయాల్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇలాంటి కేసులపై మరింత అవగాహన, అప్రమత్తత అవసరం అని చెప్పారు. ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. యువతులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.