Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..

  • సిలిగురిలో అమిత్ షా ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష..
  • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లపై ప్రత్యేక చర్చ..
  • వ్యూహాత్మక చికెన్ నెక్ కారిడార్‌ భద్రతపై కేంద్రం ఫోకస్..
Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి తూర్పు సరిహద్దుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, పరిపాలన సంస్కరణలతో పాటు వ్యూహాత్మకంగా భారత్‌లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ భద్రతను సమీక్షించారు. అమిత్ షా దబ్‌గ్రామ్-ఫుల్‌బారీ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి, బీఎస్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు.

ఈశాన్య రాష్ట్రాలను కలిపే, అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో సిలిగురి కారిడార్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రంగ్‌పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా, జాతీయ భద్రత దృష్ట్యా ఈ ప్రాంత భద్రతపై కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కీలక సమావేశంలో సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో నేర ముఠాలపై కఠిన చర్యలు, జనన-మరణ నమోదు వ్యవస్థల్ని డిజిటలైజ్ చేయడం, అక్రమ వలసలు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ఉన్నత పరిపాలనా అధికారులు, డార్జిలింగ్, జల్పైగురి, కాలింపాంగ్, అలీపుర్‌దువార్, కూచ్ బెహార్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా నియోజకవర్గాల ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు.