AIADMK-BJP: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..

  • అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ప్రకటించిన అమిత్ షా..
  • తమిళనాడు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం..
Amit Shah

Amit Shah

AIADMK-BJP: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వెళ్తామని చెప్పారు. అవసరమైతే రెండు పార్టీలు ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’’ని రూపొందిస్తామని అమిత్ షా చెప్పారు.
అన్నాడీఎంకేకి ఎలాంటి షరతులు, డిమాండ్లు లేవని, ఆ పార్టీ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఈ కూటమి ఎన్డీయేకి, అన్నా డీఎంకేకి రెండింటికి ప్రయోజనకంగంగా ఉంటుందని అమిత్ షా చెప్పారు.

Read Also: Wearing Tight Jeans: వేసవిలో జీన్స్ ధరిస్తున్నారా?

1988లో దివంగత మాజీ సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు లోక్‌సభలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఒక దశల్లో ఈ కూటమి తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుందని ఆయన చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే సులభంగా గెలుస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు.

సీట్ల పంపిణీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిత్వ శాఖల పంపిణీ రెండు తర్వాత నిర్ణయించబడుతాయని అమిత్ షా చెప్పారు. తమిళనాడులో నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి డీఎంకే సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి వాటిని లేవనెత్తుతోందని ఆయన విమర్శించారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, దళితులు-మహిళలపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారని చెప్పారు. రూ. 39,000 కోట్ల మద్యం కుంభకోణం, ఇసుక తవ్వకాల కుంభకోణం, ఎల్సీటీఓ స్కామ్, రవాణా కుంభకోణాలను డీఎంకే పార్టీ చేసిందని అమిత్ షా దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలకు డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్, అతడి కొడుకు ఉదయనిధి స్టాలిన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.