Citizenship Rules: పొరుగు దేశాల నుంచి మతపరమైన వివక్ష ఎదుర్కొని, అక్కడ మైనారిటీలుగా ఉండీ, భారత్లో స్థిరపడిన వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)’ వచ్చే నెలలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ పోర్టర్ సిద్ధంగా ఉందని, ఇప్పటికే డ్రై రన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సీఏఏ అమలు 2019లో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అయితే, ఇటీవల బీజేపీ నేతలు త్వరలోనే సీఏఏ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు.
Read Also: Delhi: ఢిల్లీలో లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించిన ఆప్.. ప్లాన్ ఇదేనా?
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం ఆధిపత్యం ఉన్న మూడు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, బౌద్దులు, పార్సీలు, జైనులు అంటే ముస్లింమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. అయితే, ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపుతోందని, రాజ్యాంగంలో లౌకిక సిద్ధాంతాలను ఉల్లంఘిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. 2019లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకి కారణమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఈ నిరసనలు సద్దుమణిగాయి.
గత రెండు సంవత్సరాల్లో, పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 30 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, హోం సెక్రటరీలకు అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏప్రిల్ 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఈ దేశాల నుంచి వచ్చిన మొత్తం 1,414 మంది ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వ చట్టం-1955 కింద రిజిస్ట్రేషన్ లేదా సహజత్వం ద్వారా భారత పౌరసత్వం ఇవ్వబడింది.