2025లో పహల్గామ్ ఉగ్ర దాడి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మతం పేరుతో ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదుల భరతం పట్టింది. దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.
తాజాగా ఆపరేషన్ సింధూర్పై డిస్కవరీ ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక విషయాలు పంచుకున్నారు. ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన వెంటనే.. విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు అజిత్ దోవల్ తెలిపారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన అన్ని వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ‘‘ప్రధాని మోడీ సౌదీ నుంచి తిరిగి వచ్చారు. విదేశాంగ కార్యదర్శి స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయంలోనే సమావేశం జరిగింది. మొదట జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన తొలి ప్రశ్న.. ‘ఇది ఎవరు చేశారు? బాధ్యులు ఎవరు?’’ అని అడిగారని దోవల్ వివరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని మోడీ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. భారత నిఘా సంస్థలు అత్యుత్తమంగా పనిచేశాయని.. చాలా తక్కువ సమయంలోనే దాడి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలపై ఒక నిర్ధారణకు రాగలిగామని వివరించారు.
వెంటాడి.. వేటాడతాం
ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడుతామని అజిత్ దోవల్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘వారిని మేం వెంటాడతాం. వారు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా.. చివరికి నరకంలో ఉన్నా సరే. వారు ఎక్కడ ఉన్నా మేం వారిని క్షమించం’’ అని హెచ్చరించారు. ప్రధాని మోడీ ‘ఆపరేషన్ సింధూర్ ఇంకా సజీవంగానే ఉంది’ అని చెప్పడం వెనుక ఉద్దేశాన్ని కూడా దోవల్ వివరించారు. ఉగ్రవాదంపై పోరాటం.. చివరి ఉగ్రవాది నిర్మూలించబడే వరకు ముగియదన్నదే మోడీ ఉద్దేశమని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అంటూ పాకిస్థాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఉగ్రవాద చర్యలను భారత్ ఇకపై యుద్ధ చర్యలుగానే పరిగణిస్తుందనే సంకేతాలను ఈ వ్యాఖ్యలు ఇచ్చాయి.
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు భారత్ ఆరోపించింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజులకే.. 2025 మే 6-7 అర్ధరాత్రి భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ప్యాడ్లపై భారత్ మూడు దళాలతో కూడిన సమన్వయ దాడులు నిర్వహించింది. లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందినట్లు గుర్తించిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్ ప్రకటించింది.
భారత్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర సైనిక ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మే 10న పాకిస్థాన్ డీజీఎంవో భారత డీజీఎంవోను సంప్రదించడంతో కాల్పుల విరమణపై అవగాహన కుదిరింది. అనంతరం పహల్గామ్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.

