Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!

  • ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం
  • బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్
  • క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బంది
Airindia

Airindia

ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఎయిరిండియాకు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. అనంతరం విమానాన్ని తక్షణమే గ్రౌండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎయిరిండియా AI2651 విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చింది. విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’‌కు చోటుచేసుకున్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. అంటే విమానం వెనుక భాగం రన్‌వేపై తగిలినట్లు అర్థం. ఈ ఘటన తర్వాత విమానాన్ని పూర్తి స్థాయి సాంకేతిక తనిఖీల కోసం సేవల నుంచి తప్పించారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ఇక బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. బెంగళూరులోని గ్రౌండ్ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తున్నారని తెలిపింది.

ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత’’ అని పేర్కొన్నారు. అలాగే నియమావళి ప్రకారం సంబంధిత నియంత్రణ సంస్థలతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

టెయిల్-స్ట్రైక్ అంటే ఏమిటి?
ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో విమానం తోక భాగం రన్‌వేను తాకడాన్ని టెయిల్-స్ట్రైక్ అంటారు. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం మరీ ఎక్కువగా పైకి వంగినప్పుడు లేదా సమతుల్యత కోల్పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంఘటన విమానానికి నష్టం కలిగించగలదు. ప్రమాదకరమైనది కూడా. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో విమానానికి క్షుణ్ణమైన సాంకేతిక తనిఖీ అవసరం.