Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక జూలై 11 నాటికి విడుదల కానుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. నేలపై ఉన్న మరో 34 మంది చనిపోయారు. వచ్చే వారం విడుదల కాబోయే ప్రాథమిక రిపోర్టు కీలకంగా మారబోతోంది. 4-5 పేజీల నిడివి ఉంటుందని భావిస్తున్న ఈ డాక్యుమెంట్లో ప్రమాదానికి సాధ్యమయ్యే కారణాలతో సహా అనేక కీలక విషయాలు ఉండనున్నాయి.
Read Also: India vs Bangladesh Series : ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ జరిగేనా…
బోయింగ్ డ్రీమ్ లైనర్787-8 విమానం, దాని సిబ్బంది, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పరిస్థితులు, జూన్ 12న వాతావరణం వంటి విషయాలు ఈ నివేదికలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. శిథిలాల వివరాలు, దర్యాప్తుకు బాధ్యత వహిస్తున్న అధికారి పేరు కూడా నివేదికలో భాగంగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ తదుపరి చేపట్టే చర్యలను, విచారణను కూడా హైలెట్ చేస్తుంది.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) మార్గదర్శకాల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు భారతదేశం ప్రాథమిక నివేదికను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రమాదం తర్వాత వైమానిక రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. విమానానికి కావాల్సిన శక్తి ఇంజన్ల నుంచి రాలేదని, ఫలితంగా టేకాఫ్ కాలేకపోయిందని చెప్పారు. మెకానికల్, ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
