Gold smuggling: ఎయిర్పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్కి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు ఎయిర్ స్టాఫ్ కూడా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ ఏకంగా దాదాపుగా 1 కేజీ బంగారంతో మే 28న పట్టుబడినట్లు అధికారులు ఈ రోజు వెల్లడించారు. మస్కట్ నుంచి కన్నూర్కి అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్ని అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: Solar Storm: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమి వైపు దూసుకువస్తున్న ‘‘సౌర తుఫాన్’’
కొచ్చిన్ డీఆర్ఐ వర్గాల ద్వారా వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మస్కట్ నుంచి వచ్చిన, కోల్కతాకి చెందిన సురభీ ఖాతున్ అనే క్యాబిన్ సిబ్బందిని అధికారులు అడ్డుకున్నారు. ఆమె తన ప్రైవేట్ పార్టులో(రెక్టమ్)లో 960 గ్రాముల బంగారాన్ని ఉంచి, స్మగ్లింగ్కి పాల్పడుతోంది. విచారణ తర్వాత ఆమెను జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్లో భాగంగా కన్నూర్లోని మహిళా జైలుకు పంపబడింది. ప్రైవేట్ పార్టులో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎయిర్ లైన్ సిబ్బందిని పట్టుకోవడం ఇదే మొదటి కేసు అని అధికారులు చెప్పారు. ఆమె ఇంతకుముందు కూడా చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. స్మగ్లింగ్ ముఠాలోని కేరళకు చెందిన వ్యక్తుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
