తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే పార్టీకి షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఏఐఏడీఎంకేలో చీలికలు పళనిస్వామికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. చీలికలను పళనిస్వామి చక్కదిద్దే పనిలో ఉండగా ముగ్గురు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేసి టీవీకే గూటికి చేరారు. అన్నాడీఎంకేకు చెందిన సత్యభామ, మరగాథం, జయకుమార్లు.. స్పీకర్ ప్రభాకర్ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. వెంటనే స్పీకర్ కూడా ఆమోదించేశారు. అనంతరం ముఖ్యమంత్రి విజయ్ను కలిసి టీవీకేలో చేరిపోయారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అధికారంలోకి రాకపోవడంతో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఇందులో కొంత మంది పళనిస్వామి వైపు.. ఇంకో 17 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణి క్యాంప్లో చేరారు. అయితే రెండు వర్గాలను కలిపేందుకు తెరవెనుక రాజీ చర్చలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో భవిష్యత్తు కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేల సంచలన రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
