Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం

  • అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం
  • 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
  • నగరం అతలాకుతలం
Rain

Rain

గుజరాత్‌లో నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ నగరాన్ని కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. కేవలం రెండు గంటల్లోనే 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా.. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. పరిస్థితుల దృష్ట్యా జూలై 24న అహ్మదాబాద్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

నగరమంతా నీటిమయం

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం.. నగరంలోని నైరుతి, వాయవ్య జోన్లలో సగటున 9 అంగుళాల వర్షపాతం నమోదైంది. పశ్చిమ జోన్‌లో 8 అంగుళాలు, మధ్య జోన్‌లో 6.5 అంగుళాలు, దక్షిణ జోన్‌లో సుమారు 4 అంగుళాల వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రధాన రహదారులు నదులను తలపించాయి. నడుము లోతు వరకు నీరు చేరడంతో అనేక కార్లు, ద్విచక్ర వాహనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. మణేక్‌బాగ్ ప్రాంతంలో ప్రజలు తమ కార్లు, బైక్‌లను వరద నీటిలో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలోనే అత్యధిక బడ్జెట్ కలిగిన మున్సిపల్ సంస్థల్లో ఒకటైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు గంటల వర్షానికే నగరం స్తంభించిపోవడం అధికారుల వైఫల్యమని విమర్శిస్తున్నారు. వర్షాకాలానికి ముందు చేపట్టిన డ్రైనేజీ, వరద నివారణ పనులు పూర్తిగా విఫలమయ్యాయని స్థానికులు ఆరోపించారు.

అహ్మదాబాద్ శివారులోని బోపాల్ పరిధిలోని అంబ్లీ గ్రామం పరిస్థితి మరింత దారుణంగా మారింది. వరద నీటితో రహదారులు, ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా స్థానిక చెరువు గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన మూడు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. సహాయం కోసం అధికారులను సంప్రదించినా స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఓట్లు అడిగేటప్పుడు అందరూ వస్తారు.. కానీ ఇలాంటి సమయంలో మాకు సహాయం చేయడానికి ఎవరూ రావడం లేదు.’’ అని పలువురు స్థానికులు విమర్శించారు. వరద ప్రభావం స్థానిక ఆరోగ్య కేంద్రంపై కూడా పడింది. దాదాపు రెండు అడుగుల మేర నీరు కేంద్రం ఆవరణలోకి చేరడంతో సిబ్బంది ప్రవేశ ద్వారాన్ని మూసివేయాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గుజరాత్‌కు రెడ్ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్య గుజరాత్, సౌరాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహిసాగర్, దాహోద్, పంచమహల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మోడీ, అమిత్ షా సమీక్ష

వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.