Agni-4 Ballistic Missile: భారతదేశం మరోసారి తన అణ్వాయుధ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది. మధ్య శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో క్షిపణి అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పెరామీటర్లను విజయవంతంగా సాధించిందని రక్షణ వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్లో ఈ పరీక్షను నిర్వహించారు.
అగ్ని-4 అనేది భారతదేశ అగ్ని క్షిపణి శ్రేణిలో కీలమైన భాగం ఇది సుమారు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధిలోకి మొత్తం పాకిస్తాన్ వస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఇది క్రియాశీల సైనిక వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారత వ్యూహాత్మక రక్షణకు అగ్ని సిరీస్ క్షిపణలు కీలకం. అగ్ని-1 నుండి అగ్ని-5 వరకు, ఈ క్షిపణులను వివిధ దూరాల్లోని లక్ష్యాలను ఛేదించడానికి అభివృద్ధి చేశారు. అగ్ని-4ను ప్రత్యేకంగా మధ్యశ్రేణి లక్ష్యాల కోసం రూపొందించారు. ఇది సాలిడ్ ఫ్యూయల్ సాంకేతికతో పనిచేస్తుంది. దీని వల్ల దీనిని వేగంగా సిద్ధం చేసి ప్రయోగించడానికి వీలవుతుంది. దీనిని రోడ్-మొబైల్ లాంచర్ నుండి కూడా ప్రయోగించవచ్చు. దీంతో దీని మొబిలిటీ పెరిగి, శత్రువులు టార్గెట్ చేయడం కష్టమవుతుంది.

