Turkey: జేఎన్‌యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..

  • ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కి సహకరించిన టర్కీ..
  • టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం..
  • ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..
  • టర్కీ ఆపిల్స్‌పై నిషేధం, టర్కీ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న పర్యాటకులు..
Turkey

Turkey

Turkey: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కి టర్కీ సహాయం చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లను పంపించింది. దీంతో పాటు వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పంపించినట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యాప్తంగా టర్కీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే, పూణేకి చెందిన ఆపిల్ వ్యాపారులు టర్కీ ఆపిల్స్‌‌పై బ్యాన్ విధించారు. మరోవైపు, భారత్ నుంచి టర్కీకి పర్యాటకం కోసం వెళ్లే వారు తమ ట్రిప్ రద్దు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, టర్కీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్న భారతీయ యూనివర్సిటీలు ఇప్పుడు వాటిని రద్దు చేసుకుంటున్నాయి. జామియా మిలియా ఇస్లామియా టర్కీ విద్యా సంస్థలతో అన్ని అవగాహన ఒప్పందాలను (MoU) నిలిపివేసింది. ‘‘టర్కీతో అనుబంధంగా ఉన్న సంస్థలతో మేము అన్ని అవగాహన ఒప్పందాలను నిలిపేస్తున్నాము. జామిమా దేశం, భారత ప్రభుత్వంతో నిలుస్తుంది’’అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Shashi Tharoor: ‘‘భారతీయుడిగా మాట్లాడా’’.. కాంగ్రెస్ ‘‘లక్షణరేఖ’’ వ్యాఖ్యలపై శశిథరూర్..

ఇదే దారిలో, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం (MANUU) కూడా నిలిచింది. టర్కీలోని యూనస్ ఎమ్రే ఇన్స్టిట్యూట్‌తో చేసుకున్న విద్యాపరమైన అవగాహన ఒప్పందాన్ని (MoU) తక్షణమే రద్దు చేస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

దీనికి ముందు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ తుర్కియేలోని మలత్యలోని ఇనోను విశ్వవిద్యాలయంతో తన విద్యా ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్‌కి అండగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మేక్‌మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ వంటి ప్రముఖ భారత ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు రెండు దేశాలకు ప్రయాణ బుకింగ్‌ల రద్దు పెరుగుతున్నట్లు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ తయారీ అసిస్‌గార్డ్ సోంగర్ కాంటాట్ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది.