NTV Telugu Site icon

Aditya-L1: ఆగస్టు 10 లోపు “ఆదిత్య-ఎల్1” ప్రయోగం.. ఇస్రో చీఫ్ క్లారిటీ..

Aditya L1

Aditya L1

Aditya-L1: సూర్యుడి అధ్యయనం కోసం భారత అంతరిక్ష సంస్థ, ఇస్రో ఆదిత్య-ఎల్1 అనే మిషన్ ను చేపడుతోంది. ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలక కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య-ఎల్1 ప్రయోగం ఎప్పుడుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సమాధానం ఇచ్చారు. శాటిలైట్ ని ఇంటిగ్రెట్ చేశామని, పేలోడ్స్ ని వివిధ ఏజెన్సీలు అభివృద్ధి చేస్తున్నాయని, ఇది శాటిలైట్ సెంటర్ కి చేరుకున్నాయని, పేలోడ్స్ ని శాటిలైట్ ని అనుసంధానించే ప్రక్రియ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రయోగానికి ముందు వరసగా కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఆదిత్య-ఎల్ 1ని పీఎస్ఎల్వీ నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10లోపు ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సోమనాథ్ అన్నారు.

Read Also: Age System: సౌత్ కొరియన్లు మరింత యవ్వనంగా మారబోతున్నారు.. కారణం ఏంటో తెలుసా..?

ఆదిత్య ఎల్1 అనేది సౌర వాతావరణ అధ్యయనం కోసం పంపుతున్న ఒక శాటిలైట్. ఇది భూమి సూర్యుడి మధ్య ఉన్న ఎల్1 బిందువు చుట్టూ ఒక కక్ష్యలో తిరుగుతుంది. సౌర అయస్కాంత తుఫానులు, భూమి పర్యావరణంపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. భూమి నుంచి దాదాపుగా 15,00,000 కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్ద ఉన్న హేలో కక్ష్యలో పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పిర్, కరోనాలను ఆదిత్య ఎల్1 అధ్యయనం చేస్తుంది.

చంద్రయాన్-3 మిషన్ ని జూలై 13న ప్రయోగించనున్నారు. చంద్రుడి అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. ఇప్పటికే చంద్రయాన్-1, 2 ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. 2019లో చంద్రయాన్ -2ని చేపట్టింది. ఆ సమయంలో శాటిలైట్ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో చేరినప్పటికీ.. ‘విక్రమ్’ ల్యాండర్ మాత్రం చంద్రుడిపై దిగే సమయంలో చివరి నిమిషంలో అనుకున్న మార్గం నుంచి పక్కకు తప్పింది, కుప్పకూలింది. దీంట్లో ఉండే రోవర్ కూడా నాశనం అయింది. అయితే ఈ సారి ఎలాగైన రోబోటిక్ రోవర్ ను చంద్రుడి ఉపరితలంపై దించాలని శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. జీఎస్ఎల్వీ-మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.