US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..

  • ఆర్ఎస్ఎస్ సంబంధిత నిధుల్ని తీసుకోం..
  • 90 మంది అమెరికా నేతల ప్రతిజ్ఞ..
  • తప్పుబడుతున్న హిందూ సంఘాలు..
  • మోహన్ భగవత్ పర్యటన తర్వాత వివాదం..
Rss

Rss

US Politics: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలోని కొన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు తీసుకోబోమని కనీసం 90 మంది అమెరికా రాజకీయ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. వీరిలో భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఆగస్టు 31న ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్’ వంటి సంస్థలు ఈ ప్రతిజ్ఞను ప్రకటించాయి. డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన పలువురు నేతలు దీనిపై సంతకాలు చేశారు.

ఆర్ఎస్ఎస్ నుంచి విరాళాలు తీసుకోబోమని, ఇప్పటికే ఒకవేళ తీసుకుంటే వాటిని తిరిగి ఇచ్చేయడం లేదా ప్రజస్వామ్యానికి మద్దతు ఇచ్చే సంస్థలకు మళ్లించడం వంటివి చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలు మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో వచ్చాయి. ఆగస్టు 29న న్యూయార్క్‌లోని మాడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో ‘యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భగవత్ పర్యటనను అమెరికాలోని రాజకీయ, పౌర హక్కుల సంస్థలు వ్యతిరేకించాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. తాజాగా తీసుకువచ్చిన ప్రతిజ్ఞపై సంతకం చేసిన వారిలో మిచిగాన్‌కు చెందిన సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్, వాషింగ్టన్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్, కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, ఇల్లినాయిస్‌కు చెందిన ప్రతినిధి రాబిన్ కెల్లీ తదితరులు ఉన్నారు.

ఆర్ఎస్ఎస్ ‘రైట్ వింగ్’ సంస్థగా అభివర్ణించిన ప్రమీలా జయరాజ్, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే సంస్థల్ని యూఎస్‌లో తిరస్కరించాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ అమెరికా ఎన్నికల్ని ప్రభావితం చేయకూడదని రోఖన్నా అన్నారు. ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్న బిలినీయర్ నుంచి ఇటీవల తాను స్వీకరించిన విరాళాలను తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఈ ప్రచారంపై హిందూ-అమెరికన్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమాన్ని వివక్షాపూరితమైనవిగా అభివర్ణించాయి. అమెరికా విలువలకు విరుద్ధంగా ఉందని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎండీ సుహాగ్ ఏ శుక్లా అన్నారు.