LPG cylinders washed away: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయగడ్ జిల్లాలోని పాతాళగంగా నదిలో సుమారు 3,000 ఎల్పీజీ (LPG) సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, నదిలో లేదా నది ఒడ్డున కనిపించే సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రాయగడ్ జిల్లాలోని పన్వేల్ తాలూకాలో ఉన్న HPCL పాతాళగంగా LPG బాట్లింగ్ ప్లాంట్ భారీ వరదలతో నీట మునిగిపోయింది. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ప్లాంట్లో నిల్వ ఉంచిన నింపిన, ఖాళీ సిలిండర్లు కలిపి సుమారు 3,000 ఎల్పీజీ సిలిండర్లు పాతాళగంగా నదిలో కొట్టుకుపోయాయి.
సిలిండర్లను ముట్టుకోవద్దు: కలెక్టర్ హెచ్చరిక
రాయగడ్ జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేశారు. “నదిలో కొట్టుకుపోయిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, అవి సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో చెప్పడం సాధ్యం కాదు. ఆసక్తితో వాటిని ఎత్తుకోవడం, ఇంటికి తీసుకెళ్లడం లేదా తెరవడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం. అలాంటి చర్యలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు” అని ఆయన హెచ్చరించారు.
సిలిండర్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
నదిలో లేదా నది పరిసర ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే స్థానిక అధికారులు, పోలీసు శాఖ లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
సిలిండర్ల కోసం గాలింపు
వరదలో కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగడ్ జిల్లాలో అప్రమత్త పరిస్థితులు కొనసాగుతుండగా, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం మరోసారి కోరింది.

