వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగా అభిమానులను ఖుషి చేసే ఒక క్రేజీ న్యూస్ ఇచ్చాడు మెగా ప్రిన్స్. వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి తన తండ్రి, ప్రముఖ నటుడు నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో సూపర్ హిట్ అందించిన యదువంశీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘బరి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు.
కొరియన్ కనకరాజు రిలీజ్ నేపథ్యంలో ఓవర్సీస్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక జూమ్ మీటింగ్లో పాల్గొన్న వరుణ్ తేజ్ స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి నాగబాబుతో కలిసి ఒకే సినిమాలో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోందని, ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తండ్రీకొడుకులు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడం వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే ఉంటుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ నాగబాబు కాంబినేషన్ ‘బరి’ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తండ్రీకొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమాను వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మిస్తుండడం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబరు నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది.

