పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్కు మంచి స్పందన లభిస్తోంది. సమాజానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితాన్ని వెండితెరపై ప్రతిబింబించిన ఈ చిత్రం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘గద్దర్’ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగానికి ఎంపిక కావడం విశేషం. ఈ చిత్రాన్ని నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో రూపొందించగా.. నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, బుసం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మాతలుగా వ్యవహరించారు. బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించగా.. డా. కళా రంగా కథను రచించారు.
ఇటీవల హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్తో పాటు సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ… ‘ప్రకృతికి సేవ చేసిన రామయ్య గారి జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ బయోపిక్ను రూపొందించాం. త్వరలోనే ఈ చిత్రాన్ని భారతీయ పలు భాషల్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ కూడా ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నామని చెప్పారు.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేశారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ.. శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇచ్చే సంస్కృతిని ప్రోత్సహించారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లడం ఆయన నిత్యకృత్యంగా కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన మరణించినప్పటికీ.. ప్రకృతి పరిరక్షణలో ఆయన చూపిన మార్గం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ‘వనజీవి రామయ్య’ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, ఆలోచనలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరనున్నాయి.
