సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయితే, అది ఓటీటీలోకి వచ్చినప్పుడు నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటారు. సినిమాలోని లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో ట్రోలింగ్ చేస్తూ హల్చల్ చేస్తారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో మాత్రం సీన్ టోటల్గా రివర్స్ అయింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా కనీస ప్రభావం చూపలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు 130 కోట్లకు అమ్ముడుపోగా, క్లోజింగ్ కలెక్షన్లు మాత్రం కేవలం 60 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. అంటే సగానికి పైగా నష్టాలను మిగిల్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది.
Also Read :Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
సాధారణంగా భారీ సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉంటాయి. కానీ ‘ఉస్తాద్’ విషయంలో ఆ సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిణామాలు పరిశీలిస్తే థియేటర్లలో టాక్ బాలేదని తెలిసిన తర్వాత, ఓటీటీలో కూడా తమ సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకని ప్రేక్షకులు భావిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఏదైనా సినిమాలో కంటెంట్ ఉంటే మెచ్చుకుంటారు, మరీ దారుణంగా ఉంటే ట్రోల్ చేస్తారు. కానీ ఉస్తాద్ను కనీసం ట్రోల్ చేయడానికి కూడా నెటిజన్లు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అసలు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి చాలా మందికి తెలియదు అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పెద్ద హీరోల సినిమాలకు ఓటీటీ రేట్లు భారీగా ఉండటానికి కారణం.. అవి అక్కడ కూడా వ్యూవర్షిప్ సాధిస్తాయనే నమ్మకం. అయితే ‘ఉస్తాద్’ లాంటి ఫలితాలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో డిజాస్టర్ సినిమాల ఓటీటీ రైట్స్ మరింత పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్, పాత కాలపు కమర్షియల్ ఫార్ములాలు ప్రస్తుత ఆడియన్స్కు రుచించడం లేదు. కేవలం హీరో ఇమేజ్ మీదనే సినిమాను నెట్టుకురావాలని చూడటం ఓటీటీ ఆడియన్స్కు నచ్చడం లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి థియేటర్లలో 70 కోట్ల నష్టాన్ని మిగిల్చిన ‘భగత్ సింగ్’, ఓటీటీలో కూడా కనీసం ప్రేక్షకులను ఆకట్టుకోలేక ‘డబుల్ డిజాస్టర్’గా నిలిచింది.
