NTV Telugu Site icon

త్రివిక్రమ్ భార్య సౌజన్య డ్యాన్స్ ప్లే ‘మీనాక్షి కళ్యాణం’…

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ప్రతిభావంతురాలైన క్లాసికల్ డాన్సర్. ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ పేరుతో శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతోంది. నిజానికి ఈ ప్రదర్శనను ఈ నెల 2వ తేదీన ప్లాన్ చేశారు. అయితే సౌజన్య పెదనాన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి హఠాన్మరణంతో ఈ ప్రదర్శన వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో నృత్య నాటక ప్రదర్శన జరగనుంది. దీనికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి.

‘మీనాక్షి కళ్యానం’కి సంబంధించిన సౌజన్య శ్రీనివాస్ అధికారిక పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ అవతార్‌లో మనోహరంగా కనిపిస్తుంది మరియు దైవిక భంగిమలో ఉంది. త్రివిక్రమ్ అభిమానులు, కళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.