తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులు కన్నుమూసిన విషయం తెలిసింది. వారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది. బాంబే రవి స్వరకల్పనలో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ”దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మనలను కవ్విస్తుంటే, మన సైన్యం యాక్షన్ తీసుకోవాలో వద్దో అని సందిగ్ధంలో ఉండేవారు, అధికారుల అనుమతి కోసం ఎదురుచూసే వారు. ప్రసుతం కేంద్ర ప్రభుత్వం ఎవరి అనుమతి అవసరం లేకుండా అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి అని బిపిన్ రావత్ సైన్యానికి మనో ధైర్యాన్ని ఇచ్చి సర్జికల్ స్ట్రైక్ చేశారు. మన సైన్యం పాకిస్థాన్ లోపలికి వెళ్లి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి మళ్ళీ మన దేశానికి రావడం పట్ల బిపీన్ రావత్ సహకారం ఎంతో ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అజయ్ కుమార్, తెలుగు ఫిల్మ్ పెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, ఈవిఎన్ చారి, కాట్రగడ్డ సుధాకర్, శివరామ్ రెడ్డి , బాంబే రవి, ఇంద్ర మోహన్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
