Site icon NTV Telugu

M. Venkaiah Naidu: ‘స్వాతంత్రోద్యమం – తెలుగు సినిమా – ప్రముఖులు’ పుస్తకావిష్కరణ

Book

Book

Telugu film Book: సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం – తెలుగు సినిమా – ప్రముఖులు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో అతిరధ మహారధుల సమక్షంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉంది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పుడు ఒక సభ నిర్వహిస్తున్నామంటే ఎక్కడెక్కడి నుండో ప్రజలు పాల్గొనేవారు. ఇప్పుడు ఏ సభ అయినా నిర్వహిస్తే మూడు ‘బీ’లు సమకూర్చాలి అంటున్నారు. మూడు బీ-లంటే బస్సు, బిరియాని, బాటిల్‌! ఈ మూడు ఉంటేనే సమావేశాలకు హాజరవుతున్నారు. ఇవన్నీ వింటుంటే మనదేశం ఎక్కడికిపోతుంది అని బాధ కలుగుతోంది” అన్నారు. ఇవాళ గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి అంటూ గురువు గొప్పతనాన్ని గురించి ముచ్చటించారు. ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి సంజయ్‌ కిశోర్‌ను ప్రయత్నించమన్నారు.

సంజయ్‌ కిశోర్‌ మాట్లాడుతూ, “ఒక సందర్భంలో కె. వి. రమణాచారి గారిని కలిసినప్పుడు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ అనే కార్యక్రమం చేస్తోంది. నువ్వు కూడా ఏదన్నా చెయ్యి సంజయ్‌ అని నాలుగు మంచి మాటలు చెప్పారు. నాకు సినిమాపై నాలెడ్జ్‌ ఉండటంతో ఆరునెలల్లో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ రచన మొదలు పెట్టాను. దీన్ని తీసుకురావడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పట్టింది” అని అన్నారు. సభాధ్యక్షుడు కె. వి.రమణాచారి మాట్లాడుతూ, “మంచి చేయమని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్తాం. అది విని ఆచరించే సంజయ్‌ కిశోర్‌ లాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు. అనేక మంచి విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతమంది గొప్పవారి గురించి సంజయ్‌ కిశోర్‌ చక్కగా రాశారు” అని కితాబిచ్చారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “బుక్‌లోని కొన్ని విషయాలు చదువుతుంటే రోమాంచితుడిని అయ్యాను. ఈ పుస్తకంలో బి. విఠలాచార్య గురించి, అల్లు రామలింగయ్య గురించి రాసిన విషయాలు తెలుసుకుని ఆశ్యర్యపోయాను’’ అని అన్నారు.

మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ, “ఈ రోజు సమాజానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో అవసరం. తెలుగు సినిమాలో ఎంతమంది గొప్పవారు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రజా ప్రతినిధులే ఎటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారో మనందరం గమనిస్తూనే ఉన్నాం. సమాజంలో మార్పు రావాలి” అని తెలిపారు. ‘సంజయ్‌ కిశోర్‌ ఏ పని తలపెట్టినా మా వంతుగా సాయం చేస్తామని, అతను తమ కుటుంబ సభ్యుడేనని కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య, ఎస్.ఇ. డబ్ల్యూ అధినేత రాజశేఖర్ అన్నారు. పుస్తక తొలి ప్రతిని శ్రీకర ఆర్గానిక్స్‌ రాజు లక్షా వెయ్యి నూటపదహారు రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీమణులు, సినిమా పెద్దలతో పాటు జొన్నలగడ్డ రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version